రాజకీయల్లో వ్యూహరచన ఎంతో ముఖ్యం. నేతలు చేసే ఆ వ్యూహాలే పార్టీ బలాన్ని పెంచుతాయి. ఎన్నికల్లో విజయాన్ని చూకూర్చుతాయి. ఇటీవల కాలంలో వ్యూహాల కోసం పార్టీలు స్ట్రాటజిస్టులను నియమించుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో మోదీ-షా ద్వయం చేసే వ్యూహాలు 90 శాతం విజయవంతం అవుతున్నాయి. తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న వ్యూహాలు మోదీ-షా వ్యూహాల ముందు తేలిపోతున్నాయి. ఇక తెలంగాణలో కేసీఆర్ వ్యూహాలు కూడా సక్సెస్ అవుతున్నాయి. తొమ్మిదేళ్లుగా తెలంగాణలో ఆయన ఎదురులేని శక్తిగా పాలన సాగిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న సమయంలో మోదీ-షా ద్వయం చేసిన ‘పద్మ’ వ్యూహం అందరినీ డిఫెన్స్లో పడేసింది. యూపీలో ప్రతిపక్ష పార్టీని ఏకాకిని చేసింది. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయంసింగ్ యాదవ్కు మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించడం ప్రధాని మోదీ ప్రభుత్వ మాస్టర్ స్ట్రోక్గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
యాదవుల్లో ఉన్నతస్థాయి నేతగా గుర్తింపు చెందిన ములాయంకు మద్దతిచ్చిన యాదవవర్గాలు, బీసీలు ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్కు పూర్తిగా మద్దతివ్వడం లేదు. దీనిని పసిగట్టిన మోదీ, వారిని తమ వైపు తిప్పుకునేందుకే ఈ వ్యూహం పన్నారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్లో అఖిలేశ్ను ఏకాకి చేసేందుకే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. దీని వల్ల సార్వత్రిక ఎన్నికల్లో ములాయం అభిమానుల్లో అనేకమంది మోదీవైపు మొగ్గు చూపుతారని ఈ వర్గాలు చెబుతున్నాయి. – యూపీలో యాదవులే కీలకం.. ఉత్తర ప్రదేశ్లో యాదవ సామాజికవర్గం అత్యంత ప్రభావవంతమైంది. ఎన్నికల్లో గెలుపోటములను వీరు ప్రభావితం చేస్తారు. నిజానికి మోదీని ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో బీసీ నేతగా బీజేపీ గత ఎనిమిదేళ్లుగా చిత్రీకరించడం మూలంగా పలు యాదవేతర బీసీలు బీజేపీ వైపు మొగ్గు చూపారు. తాజా అవార్డుతో ఇప్పుడు యాదవులు కూడా పునరాలోచన చేస్తారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.