AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ రాజధాని అమరావతికి మహర్ధశ..!

ఏపీ రాజధాని అమరావతికి మహర్ధశ పట్టనుంది. కేంద్రం సహకారంతో అధికారంలోకి వచ్చిన 11 నెలల తర్వాత రాజధాని పనులు పట్టాలకెక్కిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు . కేవలం అమరావతి నిర్మాణం కాకుండా కృష్ణానదిపై నిర్మించే వంతెన, రైల్వే లైన్లు ఇలా వరసగా పనులు చేపట్టాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

 

కేంద్రం సాయంతో అమరావతి పనులు పరుగులు పెట్టించే పనిలో పడ్డారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి కేంద్రం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది. అమరావతికి కొత్త రైల్వే లైన్‌‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అమరావతి మీదుగా రానున్న రైల్వేలైను కొత్త మార్గం రానుంది. ఎర్రుపాలెం-నంబూరు రైల్వే లైన్‌‌కు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ వేగంగా జరిగింది.

 

రైల్వేలైన్ కోసం వేగంగా

 

ఈ రైల్వే లైన్ కోసం 12 గ్రామాల పరిధిలో క్షేత్రస్థాయిలో మార్కింగ్ కార్యక్రమాన్ని పూర్తిచేశారు. కొత్త రైల్వే లైన్‌ ఎన్టీఆర్‌ జిల్లా నుంచి తెలంగాణలో ఎర్రుపాలెం మండల పరిధిలో భూసేకరణ ప్రక్రియ పూర్తి కానుంది. ప్రక్రియ మొదలుకాగానే ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు దాదాపు 27 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ మొదటి దశ పనులు మొదలుకానున్నాయి.

 

56.53 కిలోమీటర్ల మేరా ఉన్న రైల్వే లైన్‌ కోసం 22 గ్రామాల పరిధిలో భూమిని సేకరిస్తున్నారు. వీటిలో ఎన్టీఆర; పల్నాడు జిల్లాలో ఎక్కువ భూములున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిల్లో కేవలం ప్రభుత్వం భూములు కాకుండా ప్రైవేటువి ఉన్నాయి.

 

ప్రైవేటు భూములు 741.8 ఎకరాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ భూములు 98.2 ఎకరాలు, ఇనాం భూములు 52.01 ఎకరాలు ఉన్నట్లు అధికారుల లెక్క. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో 24 న్నర ఎకరాలు, ఎన్టీఆర్‌ జిల్లా 334.62 ఎకరాలు, పల్నాడు జిల్లాలో 333.95 ఎకరాలు, గుంటూరు జిల్లాల్లో 199.43 ఎకరాలు సేకరించనున్నారు.

 

ఎనిమిది మండలాలకు గాను భూసేకరణ కొలిక్కి వచ్చిన ఆయా మండలాల్లో రైల్వేశాఖ డబ్బులు డిపాజిట్‌ చేయనుంది. 22 గ్రామాల్లోరైల్వే లైన్ రానుంది. భూముల సేకరణపై అభ్యంతరాలు లేకపోలేదు. అమరావతి, తుళ్లూరు, తాడికొండ, పెదకాకాని మండలాల్లోని కొన్ని గ్రామాల రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో పెగ్‌ మార్కింగ్‌ ప్రస్తుతానికి ఆగిపోయింది.

 

ఆ గ్రామాల్లో అభ్యంతరాలు

 

రెవెన్యూ అధికారులతో ఆయా గ్రామాల ప్రజల చర్చలు కొలిక్కి వచ్చాక అక్కడ పెగ్‌ మార్కింగ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం 2,047 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. రైల్వే లైన్‌ వెళ్లే ఆయా మండలాల్లోని కొన్ని గ్రామాలు ఇలా ఉన్నాయి.

 

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని ఎర్రుపాలెం, కేసిరెడ్డిపల్లి గ్రామాలు ఉన్నాయి. ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా వీరులపాడు మండలంలోని గూడెం మాధవరం, పెద్దాపురం, అల్లూరు, చెన్నారావుపాలెం, జుజ్జూరు, నరసింహారావుపాలెం ఉన్నాయి. అలాగే కంచికచర్ల మండలంలోని గొట్టు ముక్కల, పరిటాల గ్రామాలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలోని చిలుకూరు, దాములూరు గ్రామాలు ఉన్నాయి.

 

పల్నాడు జిల్లా విషయానికొస్తే.. అమరావతి మండలంలో వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి, తుళ్లూరు మండలంలోని వడ్డమాను, మోతడక గ్రామాలు ఉన్నాయి. తాడికొండ మండలంలోని పెదపరిమి, తాడికొండ, కంతేరు, పెదకాకాని మండలంలోని కొప్పురావూరు, పెదకాకాని గ్రామాలు ఉన్నాయి. అమరావతి గ్రామాల నుంచి కాస్త అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10