హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక అల్టిమేటం జారీ చేశారు. లే అవుట్ల రూపాన్ని ఏ మాత్రం మార్చకూడదని.. ఒకవేళ ఎవరైనా మార్చితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎవరికివారు.. లే అవుట్ల రూపాన్ని మార్చే రోడ్లు, పార్కులు, ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాలను కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు.
హైడ్రా ప్రజావాణికి మొత్తం 63 ఫిర్యాదు వచ్చాయని ఆయన చెప్పారు లే ఔట్లలో రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల కబ్జాలపై చాలావరకు ఫిర్యాదులు రావడంతో ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు. శేరిలింగంపల్లి మున్సిపాలిటీ, గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 124, 125 లలో 20 ఎకరాల పరిధిలో ఫర్టిలైజర్ కార్పొరేషన్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ కాలనీ లే అవుట్ ఉంది.
సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు రహదారులు, పార్కుల సరిహద్దులను చెరిపివేయడం, షెడ్లు, నిర్మాణాలను నిర్మించడం ద్వారా మొత్తం ప్లాట్ను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు దాఖలైందని ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. తమ లే అవుట్ లోని ప్లాట్లు, రహదారులు చూపాలని, వాటిని పునరుద్ధరించాలని స్థానికులు అభ్యర్థించారని చెప్పారు. వీలైనంత త్వరగా వాటిని పునరుద్ధరించాలని ఆయన సూచించారు. రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలోని దివ్యానగర్ లేఅవుట్ లో కూడా రహదారులను ఆక్రమించి షెడ్డులు, నిర్మాణాలు చేపట్టారని, కొంతమంది ప్లాట్ యజమానులు ఫిర్యాదు చేశారు. వారు కూడా త్వరలోనే వాటిని అక్కడ నుంచి తీసివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
తనకు అనుకూలంగా దివ్యానగర్ లే అవుట్ ను తమ ఇష్టానుసారంగా షెడ్డులు, నిర్మాణాలు చేపట్టారని పలువురు ఫిర్యాదు చేశారు. 200ల ఎకరాల దివ్యానగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీని తొలగించి, రహదారుల్లో ఆంక్షలు లేకుండా చేసిన హైడ్రాకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. 2 వేలకు పై ప్లాట్లు ఉన్న దివ్యానగర్ లే అవుట్ లో హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలని అక్కడ స్థానికులు కోరారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. అక్కడి భూ యజమానులు హనుమంతరెడ్డి, జైపాల్రెడ్డితో పాటు పలువురు స్థానికులు కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.
హైదరాబాద్ లో లేఅవుట్లలో నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయో లేదో తనిఖీ చేసి, వాటిని వెంటనే తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు.