AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్మిత సబర్వాల్‌కు నోటీసులు..! ఎందుకంటే..?

సర్కారు తగ్గేదేలే. పోలీసులు వదిలేదేలే. కంచ గచ్చిబౌలి భూములపై దూకుడు పెంచారు. ఏఐ జనరేటెడ్ ఫేక్ ప్రచారంపై కొరడా ఝలిపిస్తున్నారు. జింకలు, నెమళ్లు, ఏనుగుల ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసిన వారందరి పని పట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను గుర్తిస్తున్నారు. వారందరికీ నోటీసులు జారీ చేస్తున్నారు పోలీసులు. సర్కారుకు భయపడి ఇప్పటికే కొందరు ఆ పోస్టులు డిలీట్ చేశారు. మరికొందరు అలానే ఉంచారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరి సంగతి తేలుస్తోంది పోలీస్ శాఖ. అందులో భాగంగా తాజాగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌‌కు సైతం నోటీసులు జారీ చేశారు పోలీసులు.

స్మిత సబర్వాల్‌కు నోటీసులు ఎందుకంటే..

స్మిత సబర్వాల్‌ కంచ గచ్చబౌలి భూముల విషయంలో AIఇమేజ్‌ను రీపోస్ట్ చేశారు. బుల్డోజర్ల ముందు నెమలి, జింకలు ఉన్నట్లుగా క్రియేట్ చేసిన ఇమేజ్‌ను ఆమె రీపోస్ట్ చేశారు. మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్ ఆ పోస్టు పెట్టింది. ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉండి కూడా ఆ ఫోటోను రీపోస్ట్‌ చేశారు స్మిత సబర్వాల్. కంచ గచ్చిబౌలి భూములు HCUవి కాదని ప్రభుత్వం చెబుతోంది. అయినా కూడా సెవ్ HCU అనే ట్యాగ్‌తో ఉన్న ఫోటోను స్మిత రీపోస్ట్‌ చేయడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ శాఖలో పని చేస్తూ.. ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ఎలా చేస్తారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై క్లారిటీ ఇవ్వాలంటూ పోలీసులు నోటీసుల్లో కోరారు.

గిబ్లీ పోస్టే కదాని రీపోస్ట్ చేస్తే..

హెచ్‌సీయూ లోపల ఉన్న మష్రూమ్ రాక్ ముందు భారీ సంఖ్యలో బుల్డోజర్లు వాటి ముందు నెమలి, జింకను గిబ్లీ శైలిలో ఉన్నట్లు ఆ AI ఇమేజ్ ఉంది. ఈ పోస్టుని స్మితా సబర్వాల్ రీ పోస్ట్‌ చేయగా ఇది ఫేక్ ఇమేజ్ అని పోలీసులు గుర్తించారు. BNS సెక్షన్ 179 కింద ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.

ఫేక్ ఫోటోలతో చేతులు కాలాక..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకుని ఉన్న కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సోషల్ మీడియా వేదికగ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అక్కడ పర్యావరణ విధ్వంసం, జంతుజాలం ఆవాసం కోల్పోయాయని నెటిజన్లు రకరకాల వీడియోలు ఫోటోలు షేర్ చేశారు. అయితే వాటిలే చాలా వరకు ఫేక్, ఏఐ ఆధారిత ప్రచారమే ఉందని ప్రభుత్వం చెప్పడంతో తాము చేసిన పోస్టులను చాలామంది తొలగించారు. అలా డిలీట్ చేసిన వారిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా ఉన్నారు.

ఫేక్ గాళ్లకు చెక్

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించారంటూ ప్రభుత్వ పెద్దలు మండిపడుతున్నారు. కొందరు ఏఐ వీడియోలు, ఇమేజ్‌ల ద్వారా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా తప్పుడు ప్రచారం చేశారని, వీరి వెనుక ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్దలు ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయా యూట్యూబ్ చానళ్లు, న్యూస్ వెబ్ సైట్లతో పాటు పలువురు నెటిజన్లకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. ఇప్పుడది ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వరకూ వచ్చింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10