AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉత్కంఠ ఫైనల్లో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా…

రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. ఇవాళ దుబాయ్ లో న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. కివీస్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో ఓవర్ మిగిలుండగానే ఛేదించింది.

 

కోహ్లీ తప్ప మిగతా ప్రధాన బ్యాటర్లందరూ రాణించిన వేళ… 49 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్ గా నిలిచింది. చివర్లో రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ గా బౌండరీ కొట్టడంతో టీమిండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూం నుంచి మైదానంలోకి పరుగులు తీశారు.

 

ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటను కూడా తక్కువ చేయలేం. ఆ జట్టు సాధించింది 251 పరుగులే అయినప్పటికీ, ఆ స్కోరును కాపాడుకునేందుకు చివరి వరకు పట్టువిడవకుండా పోరాడింది. అయితే, భారత బ్యాట్స్ మెన్ పట్టుదల ముందు కివీస్ ఎత్తుగడలు పనిచేయలేదు.

 

టీమిండియా ఇన్నింగ్స్ చూస్తే… కెప్టెన్ రోహిత్ శర్మ ముందుండి ఇన్నింగ్స్ నడిపించాడు. హిట్ మ్యాన్ 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 76 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 31 పరుగులు చేయగా… మాంచి ఫామ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 48 పరుగులు చేశాడు.

 

అక్షర్ పటేల్ 29, కేఎల్ రాహుల్ 34 (నాటౌట్), జడేజా 9 (నాటౌట్) తలో చేయి వేసి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చారు. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 2, మైకేల్ బ్రేస్వెల్ 2, కైల్ జేమీసన్ 1, రచిన్ రవీంద్ర 1 వికెట్ తీశారు.

 

కాగా, ఈ టోర్నీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అంతేకాదు, టోర్నీలో ఒక్కసారి కూడా టాస్ గెలవకుండానే ఏకంగా టైటిల్ నెగ్గడం విశేషం.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10