నేడో, రేపో ప్రకటించనున్న టీఎస్పీఎస్సీ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిషన్ గ్రూప్ 1తోసహా పలు నియామక పరీక్షలు రద్దు చేసింది కూడా. ఐతే రద్దయిన పరీక్షల కొత్త తేదీలకు సంబంధించిన షెడ్యూల్ను టీఎస్పీఎస్సీ నేడో, రేపో ప్రకటించనుంది..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిషన్ గ్రూప్ 1తోసహా పలు నియామక పరీక్షలు రద్దు చేసింది కూడా. ఐతే రద్దయిన పరీక్షల కొత్త తేదీలకు సంబంధించిన షెడ్యూల్ను టీఎస్పీఎస్సీ నేడో, రేపో ప్రకటించనుంది. ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల 4 పరీక్షలను రద్దు చేయగా.. రెండింటిని వాయిదా వేసింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష, డివిజనల్ అకౌంట్స్ అధికారి(డీఏవో), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ), అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పరీక్షలు రద్దయ్యాయి. టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్(టీపీబీవో), వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు కొత్త తేదీలపై టీఎస్పీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీని కమిషన్ ఇప్పటికే ఖరారు చేసింది. ఈ పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
మిగతా రద్దయిన పరీక్షలతో పాటు వాయిదా పడిన వాటికి మంగళవారం అంటే ఈ రోజు లేదా రేపు (బుధవారం) కొత్త తేదీలు వెల్లడించే అవకాశాలున్నాయి. వీటిలో కొన్ని పోస్టుల రాతపరీక్షలను గతంలో ఓఎంఆర్ పద్ధతిలో కమిషన్ నిర్వహించింది. ఐతే తాజాగా ఈ పరీక్షలను ఆన్లైన్ విధానంలో (కంప్యూటర్ ఆధారిత పరీక్షలు) నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఏయే పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించనున్నారు? ఏయే పరీక్షలు ఓఎంఆర్ పద్ధతిలో ఉంటాయన్న అంశాన్నీ కొత్త తేదీలతో పాటు ప్రకటించే అవకాశాలున్నట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి.