ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణను సవాల్ చేస్తూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు(సోమవారం) విచారించనుంది. ఈ కుంభకోణంలో ఈడీ తనకు నోటీసులు జారీ చేయడాన్ని కవిత ఈ నెల 23న దాఖలు చేసిన పిటిషన్లో సవాలు చేశారు. అంతేకాకుండా.. ఈడీ తనపై తదుపరి బలవంతపు చర్యలు తీసుకోకుండా జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ తనకు పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం జారీచేసిన నోటీసులు సీఆర్పీసీ సెక్షన్ 160కి విరుద్ధంగా ఉన్నాయని, వాంగ్మూలం నమోదు చేసేప్పుడు న్యాయవాది సమక్షంలో వీడియో చిత్రీకరణకు ఉత్తర్వులు జారీ చేయాలని కవిత ఆ పిటిషన్లో కోరారు.
