రష్యా- ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఆ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించిన విధానాన్ని నోబెల్ శాంతి బహుమతి కమిటీ సభ్యుడు అస్లే టోజె ప్రసంశించారు. శాంతిని, స్నేహాన్ని కోరుకోవడంతో ఆయన ఎప్పుడూ ముందుంటారంటూ మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. దేశం మాట్లాడితే ప్రపంచం వింటుందని భారతదేశ గొప్పదనాన్ని ప్రసంశించారు. భారత్ పర్యటనలో ఉన్న అస్లే టోజే బుధవారం మీడియా సమావేశంలో ఈ విధంగా మాట్లాడారు..
‘ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో రష్యా అణ్వాయుధాలు ప్రయోగించకుండా ప్రధాని మోదీ సానుకూల వ్యవహరించారు. భారత్ వంటి శక్తివంతమైన దేశం నుంచి ఈ విధమైన సందేశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మోదీ కొన్నేళ్లుగా ప్రధాన మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ప్రపంచంలోని సీనియర్ రాజనీతిజ్ఞుల్లో మోదీ ఒకరు. కోవిడ్ వంటి గడ్డు పరిస్థితులను తట్టుకుని ఆర్థిక సంక్షోభంలో పడనీనకుండా దేశాన్ని కాపాడారు. అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రపంచదేశాలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ దేశ అభివృద్ధికి దోహదం చేస్తున్నారు. భారత్ ప్రపంచంలోని కీలక ఆర్థిక వ్యవస్థలలో ఎదుగుతోంది. ఏ దేశాన్ని ఒత్తిడి చేయకుండా, ఏ ఒక్కరినీ బెదిరించకుండా తమ స్నేహపూర్వక వైఖరితో సత్సంబంధాలను కొనసాగిస్తోంది. భారత్ శక్తివంతమైన దేశంగా ఎదగడానికి మోదీ అమలు చేస్తున్న విధానాలే ప్రధాన కారణం. ఈ విధమైన వైఖరి అంతర్జాతీయ రాజకీయాలకు అవసరం. భారత్ ఒక సూపర్ పవర్గా అవతరించాలి. యుద్ధాలను సైతం ఆపగల సత్తా ఉన్న నాయకుడు మోదీ. ఆయన మాత్రమే శాంతిని నెలకొల్పగలరు. ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి ఇస్తే చరిత్రలో అదొక అపూర్వ ఘట్టమవుతుందని’ అస్లే టోజె వ్యాఖ్యానించారు.
కాగా నోబెల్ శాంతి బహుమతి ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటి. శాంతిని పెంపొందించడానికి గణనీయమైన కృషి చేసిన వారికి ఈ బహుమతితో సత్కరిస్తుంటారు. ఇక నోబెల్ శాంతి బహుమతికి ప్రధాని మోదీ పేరు తెరపైకి రావడం ఇదేం తొలిసారికాదు. గతంలో కూడా చాలాసార్లు ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ లో ప్రకటించే నోబెల్ శాంతి బహుమతికి మోదీ ఎంపికకావచ్చనే అంశం ప్రస్తుతం సర్వత్రా చర్చణీయాంశమైంది.