ఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ సీఎం అనుసరించిన పద్ధతి సరికాదని సుప్రీంకోర్టు సూచించింది. కేసు ఆడియో, వీడియోలను సీఎం ఎలా జడ్జిలకు పంపుతారని ప్రశ్నించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గబాయి ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలంగాణ సర్కార్ తరపున న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఆడియో, వీడియో క్లిప్పులను సుప్రీం కోర్టు జడ్జిలు సహా దేశంలోని ప్రముఖులకు కేసీఆర్ పంపారు.
కాగా కేసు వివరాల్లోకి వెళ్తే, ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంపై దర్యాప్తును సీబీఐకి తెలంగాణ హైకోర్టు అప్పగించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. సీబీఐ చేతిలోకి కేసు వెళ్తేం ఇప్పటి వరకు చేసిన విచారణ అంతా పక్కదారి పడుతుందని టీఎస్ ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్లు సిద్ధార్థ లూత్రా, దుష్యంత్ దవేలు వాదనలు వినిపించారు.
ఈ కేసులో ఆధారాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో కేసును సీబీఐకి ఎలా అప్పగిస్తారని వాదించారు. కేసుపై వాదించేందుకు తనకు మరింత సమయం కావాలని కోరారు. మరోవైపు కేసులో కీలక ఆధారాలు లీక్ చేశారన్న విషయాన్ని ప్రతివాదుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన జస్టిస్ గవాయ్.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆధారాలను మీడియాకే కాదు.. జడ్జీలకు పంపారని అన్నారు.