ఇరిగేషన్తో పాటు పలు శాఖల్లో వీఆర్ఏల సర్దుబాటు
ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ), జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్)కు రాష్ట్ర సర్కారు తీపి కబురునందించింది. నాలుగేండ్ల శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకున్న జేపీఎస్లను క్రమబద్ధీకరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. విద్యార్హతలు, సామర్థ్యాలను బట్టి వీఆర్ఏలను నీటిపారుదల, ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులకు గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను కాపాడేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించడం, మొక్కలు నాటించడం, వాటిని పర్యవేక్షించడం, పలు రకాల బాధ్యతలను రాష్ట్ర సర్కారు అప్పగించిన విషయం విదితమే. నాలుగేండ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి చేసుకున్న కార్యదర్శుల పనితీరును జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలించనున్నది. కమిటీ పరిశీలనలో నిర్దేశించిన లక్ష్యాలలో మూడింట రెండు వంతులకు చేరుకున్న వారిని రెగ్యులర్ చేయాలని ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు.
వీఆర్ఏలతో చర్చలకు కేటీఆర్ నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం
రాష్ట్రంలో పనిచేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లను, వారి విద్యార్హతలు, సామర్థ్యాలను అనుసరించి ఇరిగేషన్ సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వీఆర్ఏలతో సమావేశమై, చర్చించి వారి అభిప్రాయాలను సేకరించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.









