వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం పార్టీ పెద్దవాళ్లు చూసుకుంటారని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం సీఎల్పీ నేత భట్టి నివాసానికి చేరుకున్న పొంగులేటి ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తమ జిల్లా నేత భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలవాలని వచ్చామని అన్నారు.
జిల్లాకు సంబంధించిన రాజకీయాలపై భట్టితో చర్చించామన్నారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనను బంగాళాఖాతంలో కలపడంపై చర్చించామన్నారు. కేసీఆర్ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీరు ‘‘నేను కొట్టినట్లు చేస్తా నువ్వు ఏడ్చినట్లు చెయ్యి’’ అన్నట్లుగా ఉందంటూ సెటైర్ విసిరారు. రాష్ట్రంలో ఇప్పుడు రెండే వర్గాలు ఉన్నాయని.. అవి ఒకటి ప్రభుత్వ అనుకూల వర్గం, రెండు వ్యతిరేక వర్గం అని చెప్పుకొచ్చారు. ప్రజలు ఈసారి కేసీఆర్ను ఇంటికి పంపాలని బలంగా డిసైడ్ అయి ఉన్నారన్నారు.
ఏపీ వెళ్లి సీఎంఓ అధికారులను మాత్రమే కలిశానని… జగన్మోహన్ రెడ్డిని మాత్రం తాను కలవలేదని చెప్పారు. తన సంస్థకు చెందిన కాంట్రాక్ట్ సంబంధించిన అంశాలు అధికారులతో చర్చించామన్నారు. షర్మిల టాపిక్ ఏమాత్రం చర్చించలేదని.. షర్మిల చేరికకు సంబంధించి పార్టీలో పెద్దవాళ్ళు ఉన్నారని వాళ్లే చూసుకుంటారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.









