రాష్ట్రం ఏర్పడి పదోవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈసారి పురపాలక శాఖ దశాబ్ది నివేదికను విడుదల చేశామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పారదర్శకత, జవాబుదారితనం లక్ష్యంగా దశాబ్ది నివేదిక ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 2014 నుంచి పట్టణాల అభివృద్ధిపై ప్రతి ఏటా జూన్లో వార్షిక ప్రగతి నివేదికను విడుదల చేస్తున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ దశాబ్ది నివేదికలో 2014 నుంచి సాధించిన ప్రగతిని పొందుపరిచామన్నారు. 26 మున్సిపాలిటీలకు కేంద్రం అవార్డులు ఇచ్చింది. కొత్త పురపాలక చట్టం తెచ్చిన సీఎం కేసీఆర్దే ఈ ఘనత అని తెలిపారు. తొమ్మిదేండ్లలో పురపాలక శాఖ ద్వారా రూ.1.21 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ పదేండ్లలో 462 శాతం ఎక్కువ ఖర్చు చేశామని తెలిపారు. ఈ పదేండ్లలో చట్టబద్దంగా రావాల్సింది తప్ప కేంద్రం రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదు అని పేర్కొన్నారు.
ఏ రంగం తీసుకున్నా గతంలో కంటే అనేక రెట్లు ఎక్కువ ఖర్చు చేశామని స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పనలో గణనీయమైన వృద్ధి సాధించాం. ఈ పదేండ్లలో గణనీయమైన, గుణాత్మకమైన తేడా కనిపిస్తుందన్నారు. నగర అభివృద్ధి కోసం అనేక ఎస్పీవీలు ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. ఎస్ఆర్డీపీ ద్వారా 35 వరకు ఫ్లై ఓవర్లు నిర్మించామని గుర్తు చేశారు. ఉప్పల్, అంబర్పేట ఫ్లై ఓవర్లను జాతీయ హైవే సంస్థ పూర్తి చేయలేకపోతుందన్నారు. తాము 35 ఫ్లై ఓవర్లు పూర్తి చేస్తే, వాళ్లు 2 కూడా చేయలేకపోతున్నారు. హైదరాబాద్లో ప్రధాన రహదారుల నాణ్యత పెరిగిందని కేటీఆర్ తెలిపారు.









