మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు దోపిడీ దొంగలనీ, బందిపోటు దొంగలకంటే హీనమని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. రూ.38 వేల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరు డిజైన్ మార్చి బడ్జెట్ను రూ.1,49,131 కోట్లకు పెంచారని గుర్తుచేశారు. కాళేశ్వరానికి రూ.85 వేల కోట్ల బిల్లులు చెల్లించలేదా? అని ప్రశ్నించారు. మూడో టీఎంసీ కోసం రూ.25,831 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలిపారు. ప్రతి ఏటా రూ.25 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానిదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వనరులను మింగే తెల్ల ఏనుగు అని కాగ్ నివేదికనే వెల్లడించిందని రేవంత్ వివరించారు. ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు 64 వేల ఎకరాలే సేకరించారనీ, మరో 20 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందని తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్, హరీశ్రావు కాగ్ నివేదికపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.
రాహుల్ గాంధీని విమర్శించడమంటే హరీష్, కేటీఆర్ ఒకరిపై ఒకరు కాండ్రించి ఉమ్మేసుకున్నట్టే అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ సభను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. రాహుల్ సభను విఫలం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. జనగర్జన సభకు రాకుండా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, అక్కడి సైకో మంత్రి జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. అన్ని ఆటంకాలను దాటుకుని విజయవంతం చేసిన ఖమ్మం ప్రజలకు, నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.









